మహబూబాబాద్ జిల్లాకు చెందిన భౌతికరసాయన శాస్త్ర ఉపాధ్యాయులు డా. వి. గురునాధరావు , దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబడే నేషనల్ టీచర్స్ సైన్స్ కాన్ఫరెన్స్ (NTSC-2025) కు ఎంపికయ్యారు.
ఈ ఉపాధ్యాయ శాస్త్ర సదస్సు 2025 నవంబర్ 5 నుంచి 8 తేదీ వరకు ఛత్తీస్గఢ్ రాజధాని రాయపూర్ లోని ఎన్. హెచ్. గోయల్ వరల్డ్ స్కూల్ వేదికగా జరగనుంది.
ఈ కార్యక్రమం న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న నెట్వర్క్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ (NOSTC) ఆధ్వర్యంలో, అలాగే భారత ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (DST) లోని నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ (NCSTC) సహకారంతో నిర్వహించబడుతోంది.
ఈ ఏడాది సదస్సు థీమ్:
“జాతీయ విద్యా విధానం 2020 ద్వారా విద్యారంగంలో పరివర్తన”
(“Transforming Education Through NEP 2020”)
నవంబర్ 5న ఛత్తీస్గఢ్ గౌరవ ముఖ్యమంత్రి ఈ సదస్సును అధికారికంగా ప్రారంభించనున్నారు.
ఈ సదస్సులో డా. గురునాధరావు
” ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ _పియర్ ఇన్స్ట్రక్షన్: భౌతికరసాయన శాస్త్ర బోధనకు ఓ కొత్త నమూనా”
(“IFP Panels and Peer Instruction: A New Model for Teaching Physical Science” ) అనే అంశంపై తన పరిశోధన పత్రాన్ని సమర్పించనున్నారు. ఇందులో గ్రామీణ పాఠశాలల భౌతిక శాస్త్ర బోధనలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆయన ప్రతిపాదించిన వినూత్న పద్ధతి ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ మోడల్ ప్రకారం విద్యార్థులు స్వయంగా “లిటిల్ టీచర్స్”గా మారి, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ (IFPs) సాయంతో అనిమేషన్లు మరియు వాస్తవ ప్రపంచ అన్వయాలతో కూడిన పాఠ్య విషయాలను రూపొందించి, తమ తరగతిలోనే ఇతర విద్యార్థులకు బోధించారు. ఈ మొత్తం ప్రక్రియ 5E మోడల్ (Engage, Explore, Explain, Elaborate, Evaluate) ఆధారంగా రూపుదిద్దుకుంది.
ఈ విధానం విద్యార్థులలో ఆలోచనా శక్తి, విజ్ఞాన పరిపుష్టి మరియు నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే కాకుండా, తరగతిలో ఉత్సాహం, చురుకుదనం లో కొంత మార్పు తీసుకొని రాగలదు అని ఈ పరిశోధన ద్వారా తెలిసింది..
గురునాధరావు, ప్రస్తుతం కేసముద్రం మండలం
పెనుగొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భౌతికరసాయన శాస్త్ర ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు.
జిల్లా విద్యాశాఖ అధికారి దక్షిణామూర్తి, కేసముద్రం విద్యాశాఖ అధికారి,
పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కాలేరు యాదగిరి, ఉపాధ్యాయులు అభినందించారు