తెలంగాణా రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనకై ఉద్దేశించిన “తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వే కు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని ఇప్పటివరకు ఈ సిటిజన్ సర్వే లో కేవలం తెలంగాణ నుండే వివిధ ప్రాంతాల పౌరులు పాల్గొని తమ విలువైన సమాచారాన్ని అందచేశారని జిల్లా పౌరసంబంధాల అధికారి పసునూరి రాజేంద్రప్రసాద్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. భారత దేశ స్వాతంత్య్రానికి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్బంగా 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల నుండి తగు సలహాలు, సూచనలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం “తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వేను చేపట్టిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత వారం ప్రారంభించిన ఈ సర్వే ఈనెల 25 వతేదీ తో ముగుస్తుందని, ఈ సర్వే రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉన్నందున www.telangana.gov.in /telanganarising అనే వెబ్సైట్ ను సందర్శించి ప్రతీ ఒక్కరు తమ అమూల్యమైన సలహాలు, సూచనలను అందించాల్సిందిగా అధికారి ఈ సందర్భంగా పేర్కొన్నారు.