తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్
పేద ప్రజల ప్రజాస్వామిక హక్కుల కోసం నిరంతరం పోరాడిన హక్కుల పోరాట యోధుడు కామ్రేడ్ వల్లపు యాదగిరి అని తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ అన్నారు.
సోమవారం మహబూబాబాద్ లోని ఎన్జీవో కాలనీలో ప్రజా సంఘాలు బంధుమిత్రుల ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు అనుముల ప్రేమ్ చంద్ అధ్యక్షతన ప్రముఖ న్యాయవాది హక్కులనేత కామ్రేడ్ వల్లపు యాదగిరి సంస్మరణ సభ జరిగింది.
ఈ సభలో ప్రొఫెసర్ లక్ష్మణ్ ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. ప్రజల కోసమే జీవించి ప్రజల కోసమే తన జీవితమంటూ తన మరణం వరకు పోరాడిన మట్టి మనిషి, అనేక ప్రజా పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొని ప్రజా చైతన్యాన్నికలిగించిన పౌర హక్కుల నేత, ప్రముఖ న్యాయవాది వల్లపు యాదగిరి జీవితం నేటి తరానికి ఆదర్శం అని ఆయన అన్నారు.
వల్లపు యాదగిరి తను నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం నిలబడి కొట్లాడిన మానుకోట మట్టి బిడ్డని ఆయన కీర్తించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ వ్యక్తులకు సహజ సంపదలను దోచి పెట్టేందుకే ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజలపై అణిచివేతకు పాల్పడుతుందని ఆయన అన్నారు. ఆదివాసి ప్రాంతాల్లో ఉన్న ఖనిజ సంపదను సహజ వనరులను కార్పొరేట్ వ్యక్తులకు దోచిపెట్టెందుకే ఆదివాసులపై, ఆదివాసులకు అండగా నిలిచిన మావోయిస్టులపై హత్యాకాండను కొనసాగిస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధ పాలనను కొనసాగించకుండా హింసను ప్రేరేపిస్తుందని అన్నారు.
ప్రజా ఉద్యమకారుడుగా , విప్లవ విద్యార్థి ఉద్యమ నేతగా, న్యాయవాదిగా, అనేక పోరాటాలు నిర్వహించి ప్రజలను చైతన్య పరిచిన వల్లపు యాదగిరి జీవితం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని, వల్లపు యాదగిరి ఆశయాలను, ఆలోచన విధానాన్ని మనం కొనసాగించడమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళులు గడ్డం లక్ష్మణ్ అన్నారు
ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు విశ్వ జంపాల, చిత్తారి సోమన్న, పౌర హక్కుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావు, కొంపెల్లి వెంకటయ్య, మామిడాల సత్యనారాయణ, బిక్కి వెంకటేశ్వర్లు, చిర్రా రవి, బాజె సైదులు, దేవిరెడ్డి విజయ్, చక్రధర్ జంపాల, హెచ్ లింగన్న, కొత్తపల్లి రవి, మైస శ్రీనివాస్, గిన్నారపు మురళి తారక రామారావు, అయోధ్య రామయ్య, మార్నేని రఘు, డేగల సత్యనారాయణ, తుంపెల్లి శ్రీనివాస్, ప్రభాకర్ రెడ్డి, సందకృష్ణ, ఆరెల్లి శ్రీనివాస్, దర్శనం రామకృష్ణ, దర్గయ్య మొలకల నరేష్, ఆంగోత్ చందూలాల్, మంద శశి కుమార్, పాణి, మల్లయ్య, మున్నా, వల్లపు యాదగిరి కుటుంబ సభ్యులు అరుణ, ఐలోని, అరుణ్, శ్వేత, లక్ష్మి భార్య సాగరిక, అనిల్, వెంకటలక్ష్మి, భారతమ్మ తదితరులు పాల్గొని వల్లపు యాదగిరికి ఘనంగా నివాళులు అర్పించారు.