జిల్లాకు మంజూరైన ‘మెగా ఫ్రైట్ మెయిన్ టెనెన్స్ డిపో’ (POH/ROH) ఇక్కడే ఏర్పాటు చేయాలి
ప్రాజెక్టు తరలిపోతుంటే ప్రస్తుత ఎమ్మెల్యే, ఎంపీలు ఏం చేస్తున్నారు? మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆగ్రహం
రైల్వే సాధన కమిటీ పోరాటానికి బీఆర్ఎస్ (BRS) సంపూర్ణ మద్దతు
మహబూబాబాద్ :
మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి మంజూరైన “రైల్వే మెగా ఫ్రైట్ మెయిన్ టెనెన్స్ డిపో (POH/ROH వర్క్ షాపు)”ను ఇక్కడి నుండి వేరే ప్రాంతానికి తరలించాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోమని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ గారు హెచ్చరించారు.
ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… గిరిజన ప్రాంతం, నూతనంగా ఏర్పడిన జిల్లా కేంద్రమైన మహబూబాబాద్కు ఈ రైల్వే ప్రాజెక్టు ఎంతో కీలకమని అన్నారు. ఢిల్లీ నుండి చైన్నై, ముంబయి నుండి భువనేశ్యవర్, కలకత్తా వంటి ప్రధాన నగరాలను కలిపే ప్రధాన రైల్వే లైన్ కలిగిన మహబూబాబాద్లో ఈ వర్క్ షాపు ఏర్పాటు చేయడం ఎంతో అనుకూలమని తెలిపారు.
ఈ సందర్భంగా శంకర్ నాయక్ గారు ముఖ్యాంశాలను ప్రస్తావించారు:
భూముల లభ్యత: ఈ భారీ ప్రాజెక్టుకు అవసరమైన ప్రభుత్వ భూములు మహబూబాబాద్లో అందుబాటులో ఉన్నాయి. కావున తక్షణమే పనులు ప్రారంభించి ఇక్కడే వర్క్ షాపును ఏర్పాటు చేయాలి.
ప్రజాప్రతినిధుల వైఫల్యం: ఇంత పెద్ద ప్రాజెక్టును తరలించే కుట్ర జరుగుతుంటే, ప్రస్తుత ఎమ్మెల్యే మరియు ఎంపీలు కనీసం పట్టించుకోవడం లేదని, వారి నిర్లక్ష్య వైఖరిని ఆయన ఎద్దేవా చేశారు.
పోరాటానికి మద్దతు: ఈ ప్రాజెక్టు సాధన కొరకు పోరాటం చేస్తున్న “సాధన కమిటీ”కి బీఆర్ఎస్ (BRS) పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ఉంటుందని, పోరాటంలో తాము ముందుంటామని హామీ ఇచ్చారు.
చివరగా, ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన ఈ రైల్వే ప్రాజెక్టును కాపాడుకోవడానికి తాను ఎంత దూరమైనా వెళ్తానని, ఒకవేళ ప్రాజెక్టును తరలించే ప్రయత్నం చేస్తే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమని శంకర్ నాయక్ గారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మహ్మద్ ఫరిద్,PACS చేర్మన్ నాయిని రంజిత్,BRS పార్టీ మండల అధ్యక్షులు అశోక్,నజిర్ తదితరులు పాల్గొన్నారు