మహాతెలంగాణ/కేసముద్రం
కేసముద్రం మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో సోమవారం రాత్రి కుండే నరేష్(32) హత్య కేసును కేసముద్రం పోలీసులు ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. కేసముద్రం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో సిఐ సత్యనారాయణ, ఎస్ఐ క్రాంతి కిరణ్ తో కలిపి వివరాలు వెల్లడించారు. ఉప్పరపల్లి గ్రామంలో హత్యకు గురైన మృతుడి తండ్రి అయిలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసముద్రం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మంగళవారం కేసముద్రం సీఐ వై.సత్యనారాయణ, ఎస్సై క్రాంతి కిరణ్, సిబ్బంది కేసముద్రం గ్రామ శివారులోని కోరుకొండపల్లి క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, కేసుకు సంబంధించిన నిందితులు అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో కంకల కుమారస్వామి(46), కుండే అనూష (29), కంకల కలమ్మ (40) లను అదుపులోకి తీసుకుని విచారించగా కుటుంబ కలహాలు, మృతుడి మద్యపానం, భార్యపై తరచూ శారీరక, మానసిక వేధింపులు, ఇతర మహిళలతో సంబంధాలపై వివాదాల కారణంగా గత కొంతకాలంగా కుటుంబంలో తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయని, కుటుంబ వివాదం నేపథ్యంలో సోమవారం పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ అనంతరం ఇంటికి వెళ్తున్న సమయంలో కూడా మృతుడు నిందితులతో గొడవపడగా, ముందస్తు పథకం ప్రకారం ఇనుప రాడ్డుతో సోమవారం రాత్రి మృతుడు ఇంటి వద్దకు వచ్చి గొడవ సృష్టించిన సమయంలో అతడిని ఇనుప రాడ్డుతో తలపై పలుమార్లు కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నట్లు సిఐ తెలిపారు. హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్డు, పరారయ్యేందుకు ఉపయోగించిన మోటార్ వెహికిల్ ను స్వాధీనం చేసుకుని, నిందితులను అరెస్ట్ చేసి, కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరుపరిచినట్లు తెలిపారు.