మహాతెలంగాణ/నర్సింహులపేట:
నర్సింహులపేట మండల ఇన్చార్జి ఎంపీడీవోగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన రాంప్రసాద్ను మండల ఉపసర్పంచుల ఫోరం నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మండల ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడు చుక్క వేణు, జిల్లా ఉపాధ్యక్షుడు కాస యాకయ్యల, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ యాకూబ్, ఉపాధ్యక్షులు జోగి ఉమేష్, కాంగ్రెస్ పార్టీ గ్రామ యూత్ అధ్యక్షులు నిమ్మల శ్రీనులు శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మండల అభివృద్ధి, గ్రామపంచాయతీల బలోపేతం, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తమ వంతు సహకారం అందిస్తామని వారు పేర్కొన్నారు.
నూతన బాధ్యతలు చేపట్టిన రాంప్రసాద్కు మండలంలోని గ్రామపంచాయతీల సమస్యలను పరిష్కరించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రత్యేక దృష్టి సారించాలని ఉపసర్పంచుల ఫోరం నాయకులు కోరారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో రాంప్రసాద్ మాట్లాడుతూ మండల అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచుల ఫోరం ప్రతినిధులు, గ్రామ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.