గ్రామ సభలో సీజనల్ వ్యాధులు,పోషకాహారంపై అధికారుల అవగాహన
మహా తెలంగాణ/మరిపెడ
మరిపెడ మండలం గాలివారిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో శనివారం ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ లో భాగంగా గ్రామ సభను నిర్వహించారు. గ్రామ సర్పంచ్ నారెడ్డి కవిత సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభకు గ్రామ ప్రజలు,వివిధ శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ సందర్భంగా గ్రామసర్పంచ్ నారెడ్డి కవిత సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా గ్రామంలోని ప్రతి సమస్యను గుర్తించి,వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని,రాజకీయాలకతీతంగా గ్రామా అభివృద్ధికే మొదటి ప్రాధాన్యత అని అన్నారు.ప్రజలందరి సహకారంతో గాలివారిగూడెం గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.
ఆరోగ్య పరిరక్షణ అందరి బాధ్యత:డాక్టర్ గుగులోతు రవి నాయక్
గ్రామ సభలో పాల్గొన్న ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గుగులోతు రవి నాయక్ మాట్లాడుతూ.. వర్షాకాలం ముంచుకొస్తున్న తరుణంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.డెంగ్యూ,మలేరియా,టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలకుండా ఇళ్లు,పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని,తాగునీటి విషయంలో జాగ్రత్తలు వహించాలని అవగాహన కల్పించారు.
పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం:ఐసీడీఎస్ సూపర్వైజర్ ఉష
ఐసీడీఎస్ సూపర్వైజర్ ఉష మాట్లాడుతూ.. మహిళలు, గర్భిణులు,బాలింతలు,చిన్న పిల్లల్లో రక్తహీనత,పోషకాహార లోపాన్ని నివారించడానికి పౌష్టికాహారం (న్యూట్రిషన్)ఎంతో అవసరమని పేర్కొన్నారు.అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను,పోషక విలువలు గల ఆహారాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అభివృద్ధి పనుల వివరణ:ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఈ గ్రామంలో జరుగుతున్న మౌలిక వసతుల కల్పన,వివిధ అభివృద్ధి పనుల పురోగతిని ప్రజలకు వివరించారు.నాణ్యతా ప్రమాణాలతో పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన అవగాహన కల్పించారు.ఈ గ్రామ సభలో వార్డు సభ్యులు,పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ టీచర్లు,ఆశా కార్యకర్తలు,గ్రామ పెద్దలు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.